బీజేపీలోకి ఉద్యమ నేతలు.. విఠల్, మల్లన్న దారిలో ఇంకెందరో?
posted on Dec 6, 2021 7:39PM
తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్ విఠల్ బీజేపీ చేరారు. తీన్మార్ మల్లన్న కూడా బీజేపీలో చేరుతున్నారు. ఇక ఆ తర్వాత ఎవరి వంతో , ఎవరు కమలం గూటికి చేరతారో ఏమో కానీ, తెరాస వ్యతిరేక శక్తులకు ముఖ్యంగా ఉద్యమ నాయకులకు బీజీపీ వేదిక అవుతోంది. నిజానికి దుబ్బాక, జీహెచ్ ఎంసీ కంటే ముందు నుంచి ఈ ట్రెండ్ మొదలైనా, కాంగ్రెస్ సహా అనేక పార్టీల నాయకులు బీజేపీలో చేరినా, ఈటల రాజేందర్ ఎంట్రీ, హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయం తర్వాత ఈ జోరు ఇంకొంచెం ఎక్కువైంది.
తెలంగాణలో తెరాస తర్వాత బలమైన పార్టీ ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్ పార్టీనే,అందులో మరో అభిప్రాయానికి తావులేదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు విషయంలో అయినా, రాష్ట్రంలో హస్తం గుర్తుకు పోలైన ఓట్ల లెక్కన చూసినా కాంగ్రెస్ పార్టీదే, సెకండ్ ప్లేస్. మరో వంక రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో జోష్ పెరిగింది.దళిత గిరిజన దండోరా పేరిట రేవంత్ రెడ్డి సారధ్యంలో నిర్వహించి భారీ బహిరంగ సభలు కాంగ్రెస్ ఇమేజిని మరింతగా పెంచాయి. అలాగే, విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను ఫోకస్ చేస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు కూడా సక్సెస్ అయ్యాయి. అయినా, ఈటల మొదలు తీన్మార్ మల్లన్న వరకు, భావజాల పరంగా కాంగ్రెస్ పార్టీకే దగ్గరైనా, కాంగ్రెస్ కంటే కమల దళం వైపు మొగ్గు చూపుతున్నారు.
నిజానికి పార్టీ మారే నాయకులు ఎవరైనా, అది వారి స్వార్ధం అనుకున్నా మరొకటి అనుకున్నా తమ స్వీయ రాజకీయ భవిష్యత్’కు తొలి ప్రాధాన్యత ఇస్తారు. సిద్ధాంతమైనా మరొకటి అయినా ఆ తర్వాతనే. స్వీయ రాజకీయ భవిష్యత్’తో పాటుగా ప్రధాన శత్రువును ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రుడు అనే థియరీ ప్రకారం కూడా కొందరు నేతలు పార్టీలు మారడం, చేరడం జరగవచ్చును.తెలంగాణ విషయాన్నే తీసుకుంటే ఉధ్యమకారుల ఉమ్మడి రాజకీయ శత్రువు తెరాస.ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ ఆధిపత్యం. మరో వంక ఉద్యమ కారులు బలమైన కాంగ్రెస్ పార్టీని, కాకుండా, బెజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత, బీజీపే, తెరాసలో చేరిన కాంగ్రెస్ నాయకులి కూడా తిరిగి సొంత గూటికి చేరతారనే ప్రచారం జరిగింది. కొన్ని పేర్లు కూడా వినిపించాయి. అందులో కీలక నేతలు కూడా ఉన్నారు. అయినా, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనుకున్న కొండా విశ్వేశ్వర రెడ్డి సహా ఏ ఒక్కరూ గాంధీ భవన్ గడప తొక్కలేదు.
ఎందుకు కాంగ్రెస్ ను కాదని ఉదయం కారులు, తెరాస, కేసీఆర్ వ్యతిరేక శక్తులు బీజీపే వైపు చూస్తున్నాయి.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్లుగా నిజమైన ఉద్యమకారులకు బీజేపీ సరైన వేదిక అని ఉద్యమకారులు కూడా భావిస్తున్నారా?ఇది ఇప్పురాజకీయ వ్రగ్ల్లో జోరుగ సాగుతున్న చర్చ. కాగా, ఈరోజు (సోమవారం) ఢిల్లీలో బీజేపీలో చేరిన, తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్. విఠల్’ను కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్నఖ్వీ, తెలంగాణ భాజపా వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుగ్పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసలైన ఉద్యమకారులకు తమ పార్టీ వేదికగా మారుతోందన్నారు. నిజమైన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ ఆశయాన్ని పక్కనపెట్టి కుటుంబం, సొంతవారి ఆస్తులు పెంచడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తరుణ్చుగ్ విమర్శించారు. విఠల్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చినా నిరుద్యోగుల ఆత్మబలిదానాలు ఆగడం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.