ప్రైవేటు ఆస్పత్రులు స్వాధీనం చేసుకోండి! కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశం!
posted on Mar 25, 2020 10:02PM
ఐసోలేషన్ వార్డుల కోసం అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకోవాలని ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవసరాన్ని బట్టి ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి తెలిపారు.
ఒక్కో ఆసుపత్రిలో 2 వేల బెడ్లు అందుబాటులో ఉండేలా కొత్తగా నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయవాడలో ప్రత్యేక కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు కరోనా పరీక్షల కోసం మరో మూడు ల్యాబ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు జవహర్రెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 200 ఐసోలేషన్ బెడ్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు వివరించారు. అలాగే ప్రతి నియోజకవర్గంల క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, బుధవారం ఒక్క కోవిడ్ 19 కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. కరోనా వైరస్ అనుమానిత కేసులను ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. విదేశాలనుంచి వచ్చిన 29 వేల మందిపై గట్టి నిఘా పెట్టాం. ఎప్పట్టికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు.