జూబ్లీ ఉప పోరుకు వ్యూహాలు రెడీ !

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంలో..  దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని అన్ని పార్టీలు పాటించేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత, బీఆర్ఎస్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. ఇటీవల కంటోన్మెంట్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేశాయి. 

సో.. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్‌ నియోజక వర్గంలోనూ త్వరలోనే ఉప ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి.. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్  సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.   ముఖ్యంగా  కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, జూబ్లీ హిల్స్  సీటును కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వంక బీఆర్ఎస్  సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉందని అంటున్నారు. ముఖ్యంగా.. వరసగా మూడుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీకి, పార్టీ కంటే మిన్నగా,పార్టీ అధినేత కేసీఆర్ కు ఉన్నఅనుబంధం దృష్ట్యా..  నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నట్లు చెపుతున్నారు. మాగంటి సతీమణి సునీతను బరిలో దించి గెలిపించుకోవాలని, ఇప్పటికే కేసీఆర్ ముఖ్య నాయకులను ఆదేశించినట్లు చెపుతున్నారు. అయితే..  ఆమె పోటీకి సుముఖంగా ఉన్నారా, లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదని పార్టీ వర్గాల సమాచారం.  ఒక వేళ ఆమె పోటీకి సుముఖంగా లేకుంటే..   కేసీఆర్ కుటుంబం నుంచే మరో మహిళను పోటికి దించే ఆలోచన ఉందంటున్నారు.  అయితే.. కేసీఆర్ అందుకు అంగీకరించక పోవచ్చని కూడా చెబుతున్నారు.  

మరోవంక.. కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్  స్ట్రాటజీ నే జూబ్లీ హిల్స్  లో రీప్లే  చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి  2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి హైదరాబాద్‌ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు.  ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి  ఓటమిపాలయ్యారు. అయితే..  నాగేందర్  ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఉడుతుందా అనేది తేలకుండా వుంది. అది వేరే సంగతి. 

కంటోన్మెంట్ కు అదనంగాజూబ్లీహిల్స్‌ సీటునూ గెలుచుకుని హైదరాబాద్‌లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు అండతో గెలిచే వ్యూహానికి కాంగ్రెస్ పదును పెడుతునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఇక్కడి నుంచి  పోటీ  చేసి ఓడిపోయినా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ లేదా గతంలో ఎంఐఎం టికెట్ పై పోటీచేసిననవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చి, ఎంఐఎం మద్దతుతో ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ నాయకత్వం లెక్కలు వేస్తునట్లు చెపుతున్నారు. 

ఇక బీజేపీ విషయానికి వస్తే..  ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన    కూటమి ప్రయోగాన్ని  తెలంగాణాలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా  భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి..  మాగంటి గోపీనాథ్   టీడీపీ ప్రోడక్ట్. రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆతర్వాత.. మారిన పరిస్థితుల కారణంగా  2016లో బీఆర్ఎస్ లో చేరి వరసగా 2018, 2023 ఎన్నికల్లో విజయ సాధించారు. అయినా..  తెలుగు దేశం పార్టీతో, ముఖ్యంగా చంద్రబాబు నాయు డుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలున్నాయి.

అందుకే..  మాగంటి చనిపోయినప్పుడు లోకేష్ దంపతులు మాగంటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో  తెలంగాణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోజనలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారని తెలుస్తోంది. అయితే   ఇంతవరకు ఈ విషయం పై పార్టీ కేంద్ర నాయకత్వంతో  చర్చించలేదని, ఏదైనా తెలంగాణలో కూటమి ఎంట్రీ గురించి, పై స్థాయిలో నిర్ణయం జరగ వలసి ఉంటుదని అంటున్నారు.  ఏది ఏమైనా బీజేపీ గట్టి అభ్యర్ధిని బరిలో దించి  గట్టి పోటీ ఇస్తుందని,ఆ పార్టీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు.