సీతారాములకు పట్టు వస్త్రాలు

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులు భారీగా తరలివచ్చి సీతారాములను దర్శించుకున్నారు. అలాగే విజయనగరం జిల్లా రామతీర్థంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర మంత్రి మాణిక్యాలరావు సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కిమిడి మృణాళిని, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, రామతీర్థం ఆలయ ధర్మకర్త ఆనంద గజపతిరాజు, శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి, ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, రాష్ట్ర హిందూ ధర్మ రక్ష సమన్వయ సమితి అధ్యక్షుడు సీహెచ్ గవరయ్య తదితరులు పాల్గొన్నారు.