రూ. 22 కోట్లతో తండ్యాం ఎత్తిపోతుల పథకం ప్రారంభం
posted on May 14, 2020 2:45PM
శ్రీకాకుళం: ఆమదాలవలస నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న లైదాం ఎత్తిపోతల పథకం 75 శాతం పూర్తి అయ్యిందని స్పీకర్ తమ్మినేని సీతారం తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మధనాపురం, అన్నంపేట, వెన్నెలవలస, తాళపత్రి, నందివాడలలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకు అనుమతులు వచ్చాయని చెప్పారు. పెండింగ్ సాగునీటీ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. రూ. 22 కోట్లతో తండ్యాం ఎత్తిపోతుల పథకం ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేస్తూ జీవోలు విడుదల అయ్యాయని వెల్లడించారు. గత ప్రభుత్వం అక్రమాల వలన ఎత్తిపోతల పథకాలు డిజైన్లు మార్చడం, నష్టపరిహారం చెల్లింపులు వివాదస్పదం అయ్యాయన్నారు. నీరు చెట్టు పనుల్లో అక్రమాల వలన సాగునీటి వనరులు నిరుపయోగంగా మారయన్నారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాగునీటి పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతులను, నిధులను ఇచ్చారని చెప్పారు. నారాయణ పురం ఆనకట్ట వద్ద బ్యారేజీ కం రిజర్వాయర్ నిర్మించి ఆయకట్ట స్థిరీకరణ చేయాలని ఆయన పేర్కొన్నారు.