అక్కడా దిగజారారు!

 

 

 

గడచిన ఏడాది కాలంలో రాజకీయంగా ఎంతో దిగజారిపోయిన యు.పి.ఎ. ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధానిమన్మోహన్ సింగ్ పరువు ప్రతిష్టలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. యు.పి.ఎ. ప్రభుత్వంలో ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పుణ్యమా అని మిస్టర్ క్లీన్‌గా ఇమేజ్ వున్న మన్మోహన్‌కి బొగ్గు మసి అతుక్కుంది.

 

సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ పరువు ప్రతిష్టలు గత సంవత్సరం కంటే తగ్గిపోయాయి. ఇది చెబుతున్నది ఎవరో కాదు.. ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్. ప్రతి ఏటా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ ప్రముఖులతో ఫోర్బ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ పేరిట లిస్ట్ విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన లిస్ట్ లో రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ప్రథమ స్థానంలో నిలిచారు.



ఆ లిస్ట్ లో ఘనత వహించిన మన ఇద్దరు నాయకులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కిందకి దిగజారారు. గత సంవత్సరం సోనియాగాంధీ 12వ స్థానంలో నిలిస్తే, ఈ సంవత్సరం 21వ స్థానానికి జారిపోయారు. ప్రధాని మన్మోహన్ గత సంవత్సరం 19వ స్థానంలో నిలిస్తే ఈ సంవత్సరం 28వ స్థానానికి దిగజారారు.  ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తే గ్రాఫ్ ఇలాగే పడిపోతుంది. 2014 లిస్ట్ లో వీళ్ళిద్దరి పేర్లు టోటల్‌గా గల్లంతయ్యే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.