మహా క్లైమాక్స్..! శివసేనకు సోనియా గ్రీన్ సిగ్నల్

రోజుకో మలుపు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కి వచ్చినట్లే కనిపిస్తున్నాయి. శివసేనకు మద్దతుపై తర్జనభర్జనలు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఓకే చెప్పింది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేకాదు శివసేనకు సహకరించాలంటూ మహారాష్ట్ర కాంగ్రెస్‌ను సోనియాగాంధీ ఆదేశించారు. అయితే, శివసేనలో మొదట ఆశలు రేపిన ఎన్సీపీ తీరే ఇప్పుడు అనుమానంగా మారింది. అయితే, ఇప్పటికే పలుమార్లు సోనియాతో చర్చించిన శరద్ పవార్... శివసేనకు మద్దతుపై సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోన్న శివసేనకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి సర్కారు ఏర్పాటును 17మంది శివసేన ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిద్ధాంతపరంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, ఎన్సీపీతో పోరాడిన శివసేన... ఇప్పుడెలా ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టితే అస్సలు ఒప్పుకునేది లేదని ఉద్దవ్ కి తేల్చిచెప్పారు. అయితే, చర్చలు కొలిక్కి వస్తున్న సమయంలో 17మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం శివసేనకు తలనొప్పిగా మారింది.

ఇదిలా ఉంటే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌... సడన్ గా ప్రధాని మోడీతో సమావేశమవడంపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. శివసేనతో విసిగిపోయిన బీజేపీ.... ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుందంటూ ప్రచారం జరిగింది. అలాగే, ఎన్డీఏలోకి ఎన్సీపీ రానుందని కథనాలు వచ్చాయి. అయితే, పవార్‌పై మోడీ ప్రశంసలు కురిపించిన తర్వాత ఈ భేటీ జరగడంతో... రెండు పార్టీల దోస్తీ మధ్య దోస్తీ కుదిరిందంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తమ మధ్య రాజకీయ చర్చలేమీ జరగలేదని, రైతాంగ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికే కలిసినట్లు పవార్ క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ రాజకీయ అడుగులు ఇలాగుంటే... బీజేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా, శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్స్ ... అలాగే చిన్న పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. అయితే, త్వరలో నెలరోజుల మహాడ్రామాకు తెరపడుతుందని.... శివసేనో లేక బీజేపీనో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అంటున్నారు.