కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో ఎందుకు మాయం అయింది!

posted on: May 3, 2024 4:13PM

కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన  రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మోడీకా కమల్ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.  ట్రయల్ రన్ పూర్తి కాకముందే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు ఇచ్చి ఎంతోమంది ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చారని చ‌ర్చ దేశంలో మొద‌లైంది.  

ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మోడీ,  కోవిన్ సర్టిఫికేట్లపై తన ఫోటోను తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారందరికీ జారీ చేసే కోవిన్ సర్టిఫికేట్లపై ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను తాజాగా తొలగించారు. మనమంతా కలిసి పోరాటం చేస్తే భారత్ కోవిడ్ 19ని ఓడించగలుగుతుందని మోడీ పేరుతో సర్టిఫికేట్లు ఉండేవి. 

క‌రోనా టీకాలన్నింటినీ మరోసారి సంపూర్ణంగా పరీక్షించాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. డాక్టర్ అసీమ్ మల్హోత్రా అనే బ్రిటిష్ ఇండియన్ డాక్టర్ ఈ కొవిషీల్డ్  టీకా వల్ల గుండె పోటు, రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు వస్తున్నాయని, దీనివల్ల ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని హెచ్చరించారు. డాక్టర్ మల్హోత్రా వ్యాఖ్యలపై వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కొందరు డాక్టర్ మల్హోత్రా వాదనను సమర్ధిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

కోవిడ్ బారిన పడిన వారు పరిగెత్తడం, అధికంగా వ్యాయామం చేయడం, కఠిన శ్రమకు దూరంగా ఉండాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. ఇటీవ‌ల చిన్న వ‌య‌స్సులోనే గుండెపోటు వ‌చ్చి మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో  ఐసీఎంఆర్ దీనిపై విస్తృత అధ్యయనం చేసింది. అయితే ఇంకా ఆ రిపోర్ట్ వెలుగులోకి రాలేదు.  ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి డాక్ట‌ర్ల బృంధం గుండెపై కరోనా ప్రభావం చూపినట్లు త‌మ స్ట‌డీలో తేలిందంటున్నారు. వ్యక్తి గుండెలోని విద్యుత్ వ్యవస్థ, కండరాలు, రక్తాన్ని సరఫరా చేసే ధమనులపై క‌రోనా ప్రభావితం చూపిందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. 

రక్తం గడ్డకట్టే ముప్పు ఉన్నందువల్ల చాలా యూరోపియన్ దేశాలు ఈ కొవిషీల్డ్ ను వినియోగించకూడదని నిర్ణయించిన విషయాన్ని  పుణెలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజీ ప్రిన్స్ పాల్ డాక్టర్ అమితవ్ బెనర్జీ  గుర్తు చేస్తున్నారు.  కోవిషీల్డ్ లోని లోని డీఎన్ఏ మన శరీరంలోకి చేరిన తరువాత mRNA గా మారుతుంది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో మయొకార్డైటిస్  సమస్య వస్తుందని ఆయ‌న చెబుతున్నారు.
ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కే రాయ్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.

కోవిడ్ 19  వ్యాక్సినేషన్ తరువాత ఆకస్మిక మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నేప‌థ్యంలో  అన్ని టీకాలకు ఫుల్ సేఫ్టీ రివ్యూ నిర్వహించాలి’ అనే డిమాండ్ వ్య‌క్తం అవుతోంది.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

google-ad-img
    Related Sigment News
    • Loading...