మద్యం అక్రమాలపై దర్యాప్తునకు సిట్.. ఏపీ సర్కార్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి నగదు లావాదేవీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తునకు తెలుగుదేశం కూటమి సిట్ ను ఏర్పాటు చేసింది.

విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం సిట్‌ను నియమిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది. నగదు లావాదేవీల్లో అక్రమాలతో పాటు హోలోగ్రామ్‍‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై కూడా ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది.  జగన్ హయాంలో మద్యం అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిట్ కు అందజేయాలని ఎక్సైజ్ శాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ఇక సిట్ తన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ప్రతి 15 రోజులకు   ప్రభుత్వానికి నివేదిక  ఇవ్వాల్సి ఉంటుంది. 

సీఐడీ డీఐజీ  నేతృత్వంలో  పని చేసే ఈ సిట్ బృందంలో.    ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శివాజీ సభ్యులుగా ఉన్నారు.