కలిసిపోయిన భూమా, శిల్పా సోదరులు..!

 

ఎట్టకేలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కలిసిపోయినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. అఖరికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉండేవారు. అలాంటి ఇద్దరూ ఇప్పుడు కలిసిపోయారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిన్న టీడీపీలో చేరిన సంగతి తెలసిందే. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు భూమా, శిల్పా కూడా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాటా మాటా కలిపారు. అంతేకాదు పార్టీ పరిస్థితులపైనా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. దీంతో వారిద్దరూ కలవడంతో పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఎంతకాలం కలిసుంటారో చూడాలి.