ఏపీలో వచ్చేసిన ఎన్నికల కోడ్.. సుప్రీంకు వెళ్లే యోచనలో సర్కార్
posted on Jan 9, 2021 9:59AM
స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎపిలొంమి జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం చాన్సివ్వకుండా దూకుడుగా అయన వ్యవహరిస్తున్నారు. హైకోర్టు సూచించిన మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయిన వెంటనే.. రమేష్
కుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసారు. ఈ నెల ఇరవై మూడో తేదీన మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తం నాలుగు దశల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ మేరకు.. అయన ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసారు. 27వ తేదీన రెండో దశ, 31వ తేదీన మూడో దశ, ఫిబ్రవరి నాలుగో తేదీన నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఎస్ఈసీ తాజా ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లయింది.
గత సంవత్సరం మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయాయి. మున్సిపల్, జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల వరకూ వచ్చినా.. పంచాయతీ ఎన్నికలకు మాత్రం నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోయాయి. దీంతో… ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయించి.. దానికి సంబంధించిన ప్రోసీడింగ్స్ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా కారణం చెబుతూ.. ఎన్నికలు నిర్వహించలేమని చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీదే అంతిమ నిర్ణయం అని కోర్టులు కూడా స్పష్టం చేసినందున ప్రభుత్వం సహకరించకపోవడానికి చాన్సే లేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక సహకరించకపోతే.. అపుడు రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.
ఎన్నికల ప్రకటనకు ముందు… ఎపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ఎస్ఈసీ వద్దకు వచ్చిన ప్రభుత్వ కమిటీ.. తాము చెప్పాల్సిందంతా చెప్పి ఒక లేఖ ఇచ్చి వెళ్లారు. ఆ లేఖలో.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కొన్ని కారణాలను కూడా పేర్కొన్నారు. అయితే వారు లేఖ ఇచ్చి వెళ్లిన తర్వాత.. నిమ్మగడ్డ నేరుగా.. వారికి జవాబుగా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో.. ప్రభుత్వ అధికారుల కమిటీ వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నింటికీ అయన సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు చెప్పిన అభ్యంతరాలన్నీ గతంలో చెప్పినవేనని కాబట్టి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బట్టి… తాను ఎస్ఈసీగా ఉండగా ఎన్నికల నిర్వహించడానికి సిద్ధంగా లేనట్లు ఉందని.. తన పదవీ విరమణ తర్వాత నిర్వహించాలనుకుంటోందని.. నిమ్మగడ్డ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు సాక్ష్యంగా అయన వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి విజయనగరంలో చేసిన వ్యాఖ్యలను పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో స్థానికలు ఎన్నికలు జరుగుతాయని విజయసాయిరెడ్డి ప్రకటించైనా సంగతి తెల్సిందే. అయితే.. అయన తన లేఖలో విజయసాయిరెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక కీలక నేతగా పేర్కొన్నారు. ఆయన చేస్తున్న ప్రకటనలన్నీ… ఆ దిశగానే ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఒకపక్క కరోనా వైరస్, వ్యాక్సినేషన్ కారణంగా ఎన్నికలు సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటింది. అయితే అమెరికాలో అన్ని కరోనా కేసులున్నా కూడా అధ్యక్ష ఎన్నికలు జరిగాయంటూ కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దీంతో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఎన్నికల తేదీలు ప్రకటించిందని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ సర్కార్ న్యాయపోరాటానికి సిద్దమౌతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉండటంతో ప్రస్తుతం ఎన్నికలు సరికాదంటూ సర్కార్ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేయనుంది. అవసరం అయితే సుప్రీం తలుపుతట్టేందుకు కూడా ఎపి సర్కార్ రెడీగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.