రేణిగుంట నుండి ఢిల్లీకి దూద్ దురంతో స్పెషల్ ట్రైన్!
posted on Apr 4, 2020 8:04PM
రేణి గుంట నుండి హజరత్ నిజాముద్దీన్కి 2 పార్సల్ వ్యాన్లతో కూడిన దూధ్ దురంతో స్పెషల్ రైలుని ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే నడిపింది. విజయవంతంగా 2.4 లక్షల లీటర్ల పాలు, 23 టన్నుల మామిడిపండ్లు, మరియు 23 టన్నుల పుచ్చకాయలను ఈ రైలు ద్వారా రవాణా చేశారు.
కోవిడ్ 19ని అరికట్టే దిశలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల రవాణాకి ఏ మాత్రం ఆటంకం కలగకుండా దక్షిణ మధ్య రైల్వే రవాణా మరియు పార్సల్ రైళ్లను దేశంలోని అన్ని ప్రాంతాలకు నిరంతరంగా నడుపుతోంది.
ఇందులో భాగంగా దూద్ దురంతో స్పెషల్ రైల్ను మిల్క్ ట్యాంకర్ లను తీసుకొని ఏప్రిల్ 4 ఉదయం 8 గంటలకు రేణి గుంట నుండి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరింది. ఈ రైలులో 40 వేల లీటర్ల సామర్థం గల 6 పాల ట్యాంకర్లు, 2.40 లక్షల లీటర్ల పాలు రేణిగుంట, సింకింద్రాబాద్లలో 23 టన్నుల మామిడిపళ్ళ లోడింగ్తో ఒక పార్సల్ వ్యాను, మరియు గుంతకల్లు నుండి 23 టన్నుల పుచ్చకాయ లోడింగ్లతో మరొక పార్సల్ వ్యాన్లను ఢిల్లీకి రైలు లో రవాణా చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సరుకు రవాణా, పార్సల్ రవాణా రైళ్లను మాత్రమే నడిపిస్తున్నారు. రైలు బయలుదేరే ముందు శానిటైజేషన్ మరియు సిబ్బంది చేత సామాజిక దూరం పాటింపజేయడం వంటి ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకున్నారు.