రాహుల్ వర్సెస్ రేవంత్!

ఇద్దరి మధ్య ;పెరిగింది దూరమా.. వైరమా? 

తెలంగాణలో ఏమి జరుగుతోంది? రాష్ట్ర రాజకీయాల్లో ఇంత గందరగోళం ఏమిటి? ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి సంకేతం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలను ,గీత దాటితే వేటు తప్పదని  హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం కూలిపోతుందని, కూల్చేందుకు సుపారీ ఆఫర్లు వస్తున్నాయని జరుగతున్న ప్రచారం వెనక ఉన్న రాజకీయం ఏమిటి? మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల ధిక్కార స్వరం  దేనికి సంకేతం? ఈ అన్నిటినీ మించి, నడుస్తున్న చరిత్రను నడిపిస్తున్నది ఎవరు? రిమోట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ఇలా సమాధానం లేని  ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈ చిక్కు ప్రశ్నలే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని, ప్రశ్నార్ధకం చేస్తున్నాయని అంటున్నారు.

 నిజమే, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు సహాజమే అయితే కావచ్చు కానీ, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ఇవేవీ కూడా సహజ పరిణామాలు అనిపించడం లేదని అంటున్నారు. నిజానికి  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా దీపా దాస్ మున్షీ ఉన్నత వరకు,కాంగ్రెస్ పార్టీలో‘అంతా బాగుంది’ అన్నట్లుగానే కథ నడిచింది. ఢిల్లీ, హైదరాబాద్ సంబంధాలు అన్నీ సజావుగానే సాగిపోయాయి. కానీ,దీపాదాస్ మున్షీ  స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే పరిస్థితి మారిపోయింది. అంతే  కాదు.. అసలు ఈ  మార్పు  కోసమే  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ఏరి కోరి మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

అయితే  అది కొంత వరకు  నిజమే అయినా మీనాక్షి ఎంట్రీకి ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి  మరీ ముఖ్యంగా  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, మధ్య దూరం పెరిగిందని అంటారు. అందుకు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా.. లేకున్నా  రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి రావడం,  కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపలా బయటా మాట్లాడడం కూడా  ఇద్దరిమధ్య దూరం పెరడానికి ఒక కారణం అంటారు. నిజానికి  రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల అంతర్యం ఏమిటో ఆయన ఎందుకు అంత తరచుగా  ఢిల్లీ యాత్రలు చేశారో ఏమో గానీ, రాహుల్, రేవంత్  మధ్య దూరం పెంచేందుకు ఆయన ప్రత్యర్ధులకు మాత్రం అదొక అస్త్రంగా పనిచేసిందని అంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీ అభీష్టానికి భిన్నంగా అదానీతో ఒప్పందం కుడుర్చుకోవడం కూడా ఆ ఇద్దరి మధ్య దూరం పెంచిందని అంటారు.

సరే  తెర వెనక ఏమి జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరిగింది అనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. నిజానికి ఎవరూ కాదని అనడం లేదు కూడా. అది ఒక విధంగా ప్రత్యక్షంగా కనిపిస్తూనే వుంది. అహ్మదాబాద్ ఎఐసీసీ సదస్సు లో రాహుల్ గాంధీ, తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చు కున్నారు. ఒక విధంగా సుమారు పది నిముషాలకు పైగా మెచ్చుకున్నారు. కానీ.. ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఇది ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనేందుకు మరో నిదర్శనంగా పేర్కొంటున్నారు. అలాగే.. ఇద్దరి మధ్య పెరిగిన దూరం పర్యవసానంగానే  కాంగ్రెస్  పార్టీ పరిస్థితి హస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు.

నిజానికి మంత్రి వర్గ విస్తరణ అనే తేనె తుట్టెను కదిలిస్తే.. ఏ మవుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియంది కాదు. అయినా.. ఓ వంక రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగతున్న సమయంలో  మార్చి 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లను ఉన్నపళంగా ఢిల్లీకి వచ్చేయమని అధిష్టానం ఆదేశించింది. ఆ రాత్రి ఏమి జరిగిందో కానీ.. మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్  సిగ్నల్  అనే వార్త వచ్చింది. అంతే కాదు.. కొత్తగా కొలువు తీరే మంత్రుల పేర్లు, ముహూర్తాలు కూడా ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అయితే ముహూర్తాలు వచ్చి పోయాయి కానీ.. మంత్రి వర్గ విస్తరణ అయితే జరగలేదు.

కానీ విస్తరణ చుట్టూ కావలసినంత రాజకీయం అయితే  జరిగింది. అసలు అంతలా ఉరుకులు పరుగులు పెడుతూ హడావిడిగా రాత్రికి రాత్రి, అది కూడా బడ్జెట్ సమావేశాలు జరుగతున్న సమయలో మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? నిజంగా అలాంటి అవసరం వచ్చి ఉంటే.. ఆ తర్వాత అధిష్టానం ఎందుకు ఉలుకూ పలుకూ లేకుండా ఎందుకు మౌనంగా ఉంది పోయింది?  తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి  అన్నట్లుగా ఎందుకు తమాషా చూస్తోంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  

అలాగే, కంచ గచ్చిబౌలి భూముల వివాదం విషయంలోనూ  మీనాక్షి నటరాజన్  గీత దాటి చూపించిన చొరవ తదితర పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం పైనుంచి జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు.  నిజానికి రాహుల్ గాంధీ, రేవంత్  రెడ్డి మధ్య  దూరం పెరగడం కాదు, వైరం పెరిగిందనీ ఆ   వైరం పర్యవసానంగానే కాంగ్రెస్ పరిస్థతి  హస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు.