ఉజ్జయిని మహంకాళికి మొక్కులు చెల్లించిన సింధు

రియో ఒలింపిక్స్‌‌లో రజత పతకం సాధించిన బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. చీరకట్టులో పదహారణాల తెలుగమ్మాయిలా ముస్తాబై తన తల్లితో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతియేటా బోనాల సమయంలో అమ్మకు బోనం సమర్పించడం తనకు అలవాటని, ఈ సంవత్సరం ఒలింపిక్స్‌ కారణంగా అమ్మవారిని దర్శించుకోలేకపోయానని చెప్పారు. భవిష్యత్తులోనూ తనను ఇలాగే కరుణించాలని కోరుకున్నట్లు తెలిపింది.