భార్యతో చర్చిలో పవన్ ప్రత్యేక ప్రార్థనలు

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చాలా కాలం తర్వాత జనం మధ్యకు వచ్చారు. ఆయన తన భార్య అన్నా లెజ్‌నోవాతో కలిసి సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఇవాళ ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవన్ దంపతులతో పాటు పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. పవన్‌ను చూసేందుకు ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అనంతరం పోలాండ్ అంబాసిడర్‌తో పవన్ తన కార్యాలయంలో భేటీ అయ్యారు.

 

ఈ సందర్భంగా పవన్ దంపతులకు ఆడమ్ దంపతులు బహుమతులు అందజేయగా.. పవన్ భార్య అన్నా వారిద్దరికీ బహుమతులను అందించారు. కొందరు ప్రత్యేక ఆహ్వానితులు, విదేశీ విద్యార్థులతో ఆడమ్, పవన్ ముచ్చటించారు. ఆడమ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చాలా తెలివైన వారని.. భారతీయ చిత్ర పరిశ్రమలోని గొప్ప నటుల్లో పవన్ ఒకరని అన్నారు. అతని మనస్సులో ఎన్నో మంచి ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. పోలాండ్‌లో సినిమా షూటింగ్‌లు తీయాలని.. అందుకు తన సహకారం ఉంటుందని తెలిపారు.