ఏపీలో వైసీపీ అనుబంధ సంస్థగా పోలీసు వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక చట్టం అమలులో ఉందా? ఆ రాష్ట్రంలో న్యాయం అన్న పదానికి మరో అర్ధం ఉందా? సామాన్య ప్రజల నుంచి పరిశీలకుల వరకూ అందరిలోనూ ఇదే సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో భారత రాజ్యాంగం అమలు అమలుకు నోచుకోవడం లేదన్న భావన రాష్ట్ర ప్రజలలో వ్యక్తం అవుతోంది. నిరసన తెలిపే హక్కును అధికారపార్టీ కాలరాసేసిందనీ,  పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుబంధ సంస్థగా పని చేస్తోందనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ విధానాలను వ్యతిరేకించినా, నిరసన గళం వినిపించినా జైళ్లు నోళ్లు తెరుస్తాయి. లాఠీలు వీర విహారం చేస్తాయి. విపక్ష నేతలపైనే కేసులు నమోదౌతాయి.

అధికార పార్టీకి చెందిన వారు హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినా కేసు నమోదు చేయడానికి పోలీసులు ముందు వెనుకలాడుతారు. అనివార్యంగా అరెస్టు చేయాల్సి వచ్చినా అరెస్టుకు ముందు, తరువాత కూడా రాచమర్యాదలు చేస్తారు. బెయిలుకు అడ్డు చెప్పరు. దర్యాప్తు ముందుకు కదలదు. అదే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి విషయంలో చిన్న చిన్న ఘర్షణ కేసుల్లో కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారు. ఎప్పుడో రెండు నెలల కిందట జరిగిన ఘర్షణ సంఘటనపై ఇప్పుడు హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అవును మాచర్లలో అగస్టు 30న జరిగిన ఘర్షణ కేసులో ఇప్పుడు ఏకపక్షంగా ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంగళ్లు కేసులో నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అక్షింతలు వేసింది, ఆ కేసులో ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయడానికి నిరాకరించింది. సుప్రీం కోర్టు ఏపీ పోలీసులపై అక్షింతలు వేసిన రోజునే  మాచర్ల పోలీసులు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు బనాయించారు. ఎవరో ఫిర్యాదు చేశారంటూ కేసు నమోదు చేశారు.

ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని అరెస్టు చేయడమే ధ్యేయమన్నట్లు అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా   వందల మంది పోలీసులతో తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేస్తారు. పద్ధితి ఉండదు. న్యాయస్థానాలకు సైతం తప్పుడు సమాచారం ఇవ్వడానికి వెనుకాడరు.    రాజకీయకుట్రల్లో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దన్నుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా, రాష్ట్ర పోలీసు శాఖ పరువు మంటగలుస్తున్నా ఖాతరీ లేదు. ఏలిన వారి సేవలో తరిస్తే చాలు అన్నట్లుగా ఏపీ పోలీస్ తీరు ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థతి అధ్వానంగా మారిపోయింది. దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు యథేచ్చగా జరుగుతున్నా నో పోలీస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలిపారంటూ అరవై మందిపై కేసులు పెట్టారు.   పోలీసు యాక్ట్ 30, సెక్షన్ 144 ఆంక్షలు రాష్ట్రంలో నిరవధికంగా అమలు అవుతున్నాయి. ఏపీలో ఎమెర్జెన్సీ పరిస్థితులు కొలువుతీరి ఉన్నాయి.  అధికార పార్టీ నేతల అండతో దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్న వారిపై నో కేస్..విపక్ష నేతలపై రాజకీయ వేధింపుల విషయంలో మాత్రం పోలీసులు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.  

 ఏపీ పోలీస్ వ్యవస్థ జగన్ పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. జగన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల దురాగతాలు, దారుణాలు జరిగిపోతున్నా అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అసలా విషయమే మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఎందుకు పని చేస్తోంది. ఎవరి తరఫున పని చేస్తోంది అన్న ప్రశ్నలు జనబాహుల్యంలో వినిపిస్తున్నాయి.  
అధికార పార్టీ అరాచకాలకు, అన్యాయాలకు, అడ్డగోలు దాడులకు వత్తాసు పలకడానికీ, వారి తరఫున ప్రత్యర్థులపై కేసులు పెట్టడానికే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పరిమితమైందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష నేతలను అడ్డగోలుగా అరెస్టు చేయడానికీ, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై కేసులు బనాయించడానికీ తప్ప పోలీసులు సామాన్యుల రక్షణ కూడా తమ విధినిర్వహణలో భాగమని మరిచిపోయారా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. 

అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసినా పోలీసులు ఆయనకు కొమ్ము కాయడానికే ప్రయత్నించడం, తన సోదరిని వేధిస్తున్నాడని నిలదీసిన బాలుడిని హత్య చేసి దహనం చేయడం వంటి సంఘటనలు జరిగిన సందర్భంలో పోలీసులు తీరు బాధితులకు స్వాంతన కలిగించేలా నిందితులను అరెస్టు చేయడం, చర్యలు తీసుకోవడానికి బదులుగా నిందితులకు వత్తాసుగా నిలిచిన సంఘటను నిత్యం జరుగుతున్నాయి.  మహిళలపైఅత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోయాయి. విపక్ష పార్టీ నేతలపై వైసీపీ మూకలు యథేచ్ఛగా దాడులకు పాల్పడినా పోలీసులు మాత్రం అధికార పార్టీకి దన్నుగా నిలిచి బాధితులపైనే కేసులు పెడుతున్న సంఘటనలు కొకొల్లలు. అంగళ్లులో విపక్ష నేతపై వైసీపీ వాళ్లు రాళ్ల దాడి చేస్తే.. కేసులు మాత్రం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై నమోదు చేశారు. ఏ సందర్భంలోనూ కూడా బాధితులకు అండగా పోలీసులు నిలిచిన సందర్భం కనిపించదు. గుంటూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగితే నో పోలీస్. అదే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది రోజుల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోతే.. నో పోలీస్. ఆ చిన్నారి అదృష్టం, తల్లిదండ్రుల అదృష్టం దాదాపు 24 గంటల తరువాత నరసరావు పేట ఉప్పల పాడు వద్ద చిన్నారి ట్రేస్ అయ్యింది. తల్లిదండ్రుల వద్ద కు చేరిందనుకోండి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డూ అదుపూ లేకుండా నేరాలు జరుగుతుంటే పోలీసులు మాత్రం అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. మొత్తంగా ఏపీ పోలీసుల ప్రతిష్ట గంగలో కలిసిపోయినా పోలీసు బాసులకు పట్టడం లేదు. వందల మంది పోలీసులను ప్రభుత్వ పెద్దల, వైసీపీ నేతల ఆదేశాలను అమలు చేయడానికి నియోగించి రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేశారు. జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడానికీ, ఆయన అరెస్టు అనంతరం వెల్లువెత్తిన శాంతియుత ర్యాలీలు, నిరసనలను అణచివేయడానికి మాత్రం వేల సంఖ్యలో పోలీసుల మోహరిస్తారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అరెస్టు చేయడానికి , ఆయన నివాసాన్ని చుట్టుమట్టడానికీ మాత్రం వందల సంఖ్యలో పోలీసులు రెడీగా ఉంటారు. అయితే బాధితుల పక్షాన నిలవడానికీ, వారికి న్యాయం చేయడానినీ, దాడులకు గురయ్యే వారిని రక్షించడానికీ మాత్రం నో  పోలీస్. ఇదీ ఏపీలో రాష్ట్ర పోలీసుల తీరు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.