పాక్ లో ఘోర విమాన ప్రమాదం.. వంద మందికి పైగా మృతి?

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 98 మంది ఉన్నట్టు తెలుస్తోంది. విమానంలో ఉన్నవారిలో 91 మంది ప్రయాణికులు కాగా, ఏడుగురు విమాన సిబ్బంది. ఈ ప్రమాదంలో వారంతా మరణించి వుంటారని అనుమానిస్తున్నారు. 

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-8303 విమానం లాహోర్ నుంచి కరాచీ వెళ్తుండగా.. ల్యాండింగ్ కు సిద్దమవుతున్న తరుణంలో ప్రమాదం జరిగింది. జిన్నా విమానాశ్రయం సమీపంలో.. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ కాలనీలో జనావాసాల మధ్యలో కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున పొగ రావడంతో పరిసర ప్రాంత జనం పరుగులు తీశారు. విమానంలో వున్న 98 మంది సహా కూలిన ఏరియా నివాస ప్రాంతం కావడంతో మృతుల సంఖ్య వందకి పైగా వుంటుందని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.