మూడు రాజధానుల శంకుస్థాపన వాయిదా.. కారణం అదేనా..!
posted on Aug 11, 2020 4:33PM
ఎపి ప్రభుత్వం ముందుగా అనుకున్నట్లుగా ఈ నెల 16 న చేయ తలపెట్టిన మూడు రాజధానుల శంకుస్థాపన వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో పాటు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున వేసిన పిటిషన్ ఇంకా విచారణకు రాకపోవటంతో పాటు మరో ముఖ్య కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది..
మూడు రాజధానుల శంకుస్థాపన కోసం సీఎం జగన్ పీఎం నరేంద్రమోడీని ఆహ్వానించాలని భావించి అపాయింట్ మెంట్ కూడా అడిగారు. దీని కోసం స్వయంగా మోడీని కలిసి ఆహ్వానించడానికి సమయం కూడా కోరారు. ఒక వేళ ప్రధాని స్వయంగా హజరుకాలేక పోతే కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా హజరయ్యేలా చూడాలని కూడా విజ్ఞప్తి చేశారు. కానీ ప్రధాని మోడీ నుండి ఎలాంటి సమాధానం రాలేదు అంతేకాక అసలు కలవడానికి సమయం ఇస్తారో లేదో కూడా చెప్పలేదు. ఐతే దీనికి కారణం ఈ విషయంలో కోర్టు కేసులు, ఉద్యమాలు కూడా ఉండడంతో మూడు రాజధానుల శంకుస్థాపన వాయిదా పడినట్లు తెలుస్తోంది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిలో భూమిపూజ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో పక్క మూడు రాజధానుల వ్యవహారం పై కేసులు పెండింగ్ లో ఉండడం, అదే విధంగా ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థుతల వల్ల కూడా శంకుస్థాపన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఐతే మరో రెండు నెలల వరకు మంచి ముహూర్తం లేని కారణంగా బహుశా దసరా సమయానికి కేసులు పరిష్కారమవుతాయని. అలాగే కరోనా కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున అపుడు శంకుస్థాపన కార్యక్రమం జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.