మేమే 20 వేల కోట్లిస్తాం.. సీఎం పదవి మాకివ్వు
posted on Aug 13, 2018 10:46AM
కాపు రేజర్వేషన్ల గురించి ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి.. తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జగన్ పై మండిపడ్డారు.. మాట తప్పను, మడం తిప్పనంటున్న జగన్.. కాపు రిజర్వేషన్ల విషయంలో ఒక్కో సభలో ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు.. సీఎం చంద్రబాబు రూ.5 వేల కోట్లకు పాడుకుంటే, తాను అధికారానికి వస్తే రూ.10 వేల కోట్లు కాపులకు కేటాయిస్తాననడం తమను అవమానించినట్లేనని అన్నారు.. మేమే రూ.20 వేల కోట్లు ఇస్తాం, సీఎం పదవి ఇవ్వండి అని మండిపడ్డారు.
'రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువ ఇవ్వకూడదని రాజ్యాంగం చెబుతోందని చదివానంటున్న జగన్.. జగ్గంపేటలో ఒకరకంగా, తునిలో మరోరకంగా మాట్లాడి చంద్రబాబులా అబద్ధం చెప్పననడం ఆయనకే చెల్లింది.. 2016లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఎన్నోసార్లు సభల్లో, అసెంబ్లీలో డిమాండ్ చేసి ఇప్పుడిలా మాట్లాడడం దారుణం.. బ్రిటిష్ కాలంలో కాపు, ఒంటరి, తెలగ, బలిజలు అనుభవించిన రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు అంటేనే వాటి అమలుకు పోరాడుతున్నాం’ అన్నారు.. అసెంబ్లీలో బిల్లు చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి తొమ్మిది నెలలు దాటినా అమలుకు నోచుకోలేదు.. తమ జాతి ప్రయోజనాలను కాపాడే పార్టీ పల్లకీనే 2019 ఎన్నికల్లో మోస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.