రెండు మూడు రోజుల్లో వాళ్ళు నాపై దాడి చేస్తారు.. రఘురామరాజు సెన్సేషనల్ కామెంట్స్ 

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కు వైసిపికి మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెల్సిందే. తాజాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రఘురామరాజుకు.. తోటి వైసిపి ఎంపీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామరాజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంపై దాడికి కార్యాచరణ రూపొందిందని.. మరో రెండు, మూడు రోజుల్లో దాడి కూడా జరగనుందని ఆయన అన్నారు.

ఈ దాడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. తనపై దాడి చేస్తే ఆవేశపడి ఒక మాట అనే అవకాశం ఉందనే ఆలోచనల్లో వైసిపి వాళ్లు ఉన్నారన్నారు. తనను తోలు తీస్తా అన్నారని, ఊళ్లోకి రా.. పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టేస్తామని కొందరు తనను హెచ్చరించిన విషయాలను ఈ సందర్భంగా అయన గుర్తు చేశారు. కేవలం ఒక ఎంపీ అన్న వ్యాఖ్యలను తాను ప్రస్తావిస్తే.. దానికి ఏకంగా ఒక జాతిని సంఘటితం చేసి.. వాళ్ల జాతిని అవమానించినట్టు చిత్రీకరించారన్నారు. తాను అన్న మాటలకు రుజువులు ఉన్నాయని, అయితే తన వెనక జరుగుతున్న కుట్ర గురించి అందరికి తెలియాలనే ఈ విషయాలు తెలుపుతున్నానన్నారు. తనపై దాడి వార్తలు వారి ఆధ్వర్యంలోని ఒక ఛానెల్, అలాగే పేపర్‌లలో వస్తాయని ఆయన తెలిపారు.

ఎన్నో దళిత సంఘాలు తనకు ఫోన్ చేసి మద్దతుగా ఉంటున్నారని అయన చెప్పారు. దీనిపై దళిత హిందూ నాయకులు తనతో మాట్లాడారని, వారి హక్కుల కోసం పోరాడటంతోనే తనకు మద్దతుగా నిలిచారన్నారు. కొంతమంది దళిత క్రిస్టియన్లు హిందువుల ముసుగులో రిజర్వేషన్లు కొట్టేస్తున్నారని... ఈ విషయాన్ని తాను పలు మార్లు ప్రస్తావించానన్నారు. అందుకే హిందూ దళిత నాయకులు తన వెంట నిలిచారన్నారు. అయితే ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.