మోడీపై కేసు.. నోటీసులు జారీ..

 

ప్రధాని నరేంద్ర మోడీపై కేసు వేశారు. మోడీపై కేసు ఎవరు వేశారబ్బా అనుకుంటున్నారా..? మనం దేశంలో కాదులెండి.. జపాన్‌కు చెందిన వాహన తయారీ దిగ్గజం నిస్సాన్ నరేంద్రమోదీకి లీగల్ నోటీసు పంపింది. భారత్‌లో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసే సమయంలో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి, ఆ హామీని ఉల్లంఘించినందుకు గాను ఈ నోటీసు పంపింది.

 

అసలు సంగతేంటంటే.... నిస్సాన్ 2008లో తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో పలు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం-నిస్సాన్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం వాటి గురించి మర్చిపోయింది. దీంతో బకాయి ప్రోత్సాహకాలను ఇప్పించాల్సిందిగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నిస్సాన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనిలో భాగంగా... 2016లో నిస్సాన్ చైర్మన్  కార్లోస్‌ ఘోస్‌ ప్రధానికి లేఖ రాశారు. తమకు రావాల్సిన ప్రోత్సాహకాల పన్ను బకాయిలు 700 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5వేల కోట్లు) వరకు ఉన్నాయని.. తమకు ఇప్పించాలని కోరారు. అయితే మొదట ఎటువంటి స్పందన రాకపోవడంతో... ప్రధాని మోదీకి నిస్సాన్ నోటీసులు పంపింది. దాంతో ఆ వెంటనే స్పందించిన కేంద్రం.. తొందర పడవద్దని, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని, న్యాయస్థానం వరకు వెళ్లవద్దని నిస్సాన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. దీనికి తిరస్కరించిన నిస్సాన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ (అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం)లో కేసు వేసింది.