మంత్రి సీటుకే ఎసరు పెట్టిన మహిళ..!!
posted on Jul 20, 2018 1:00PM
గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన రజనీకుమారి అనే ఓ మహిళ చంద్రబాబు అంటే వల్లమాలిన అభిమానమని,పార్టీలో పనిచేస్తానని చెప్పడంతో నియోజకవర్గానికి చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆమెను పార్టీలో చేర్చుకున్నారు. మహానాడు సభలో ప్రసంగించే అవకాశం కూడా కల్పించారు.ఆమె కూడా ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనటంతో అధినేత చంద్రబాబు కి కూడా పరిచయం చేసారు. మరి ఇంత చేసిన పుల్లారావు కి అనూహ్య పరిణామం ఎదురైంది.
ఆమె చిలకలూరిపేట నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉందట.ఇందుకోసం పలువురు నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది.2014 లో చిలకలూరిపేట నుంచి పోటీచేసి గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు.అంతేకాక పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడి బాధ్యతలను పుల్లారావు సమర్థంగా పోషించారు,పార్టీని ముందుండి నడిపించారు.అలాంటి వ్యక్తిని కాదని కొత్తవారిని టికెట్ ఎలా ఇస్తామన్నది హైకమాండ్ అభిప్రాయం. పైగా రజనీకుమారి మామకు మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. అయితే చిలకలూరిపేట టికెట్ తనకే కావాలని పట్టబడుతూ వచ్చిన రజనీకుమారి హైకమాండ్ నిర్ణయం తో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారట! పైగా పుల్లారావు ఎలాగైనా ఓడించి తీరతానని శపథం కూడా చేశారట!.ఆయనను ఓడించి తీరుతానని అనటంతో ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లోనూ, టీడీపీలోనూ హాట్టాపిక్గా మారింది.