మంత్రిగారి నోటి దురద!
posted on Oct 24, 2013 12:23PM
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలు అధికారుల నిర్లక్ష్యం వల్లే సరిగా అమలు కావడం లేదని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి వాపోతున్నాడు. అక్కడితో ఆగకుండా ప్రభుత్వం పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను కొట్టండని వీధి రౌడీ తరహాలో ప్రజలకు పిలుపు ఇచ్చాడు.
మీ పథకాల్లో, ప్రభుత్వ విధానాల్లో సత్తా లేక, వాటిని సరిదిద్దుకునే దమ్ములేక అధికారులను కొట్టండని పిలుపు ఇవ్వడమేంటని ప్రభుత్వోద్యోగులు సీరియస్ అవుతున్నారు. ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనని అంటున్నారు. మంత్రి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నారు. అధికారులు సరిగా పని చేయకపోతే లోపం ఎక్కడుందో పరిశీలించి దాన్ని సరిదిద్దుకోవాలిగానీ, అధికారులను కొట్టండని పిలుపు ఇవ్వడమేంటి మంత్రిగారూ.
మీరు అన్నట్టు తప్పు చేసిన వారిని కొట్టడం న్యాయమే అయితే ప్రజలు ముందుగా కొట్టాల్సింది మిమ్మల్నే! ఎన్నికల కమీషన్కి ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో తమరి మీద వున్న ఆర్థిక నేరాల కేసులను చూపించకుండా దాచిన పాపానికి తమర్ని కొట్టాలా? రాజకీయాల నుంచి తరిమికొట్టాలా? ఈ రెండిట్లో ఏది చేయాలో మీరే తేల్చుకోండని అధికారులు అంటున్నారు. మంత్రిగారు నోటి దురద తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.