బెల్లంకొండ ఇంటిముందు మంచులక్ష్మి మనుషుల ‘రభస’

 

వెరైటీ సంఘటనలకు నిలయమైన సినిమా ఇండస్ట్రీలో మరో వెరైటీ సంఘటన జరిగింది. నటుడు, నిర్మాత మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మికి చెందిన మనుషులుగా పేర్కొంటున్నవారు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంటిముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం రాత్రి 9 గంటలకు ‘మంచు లక్ష్మి మనుషులు’ ఆందోళన చేశారు. ఇలా ఆందోళన చేయడం వెనుక వున్న కారణాలను పరిశీలిస్తే, మంచు లక్ష్మి నిర్మించిన ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సినిమా సెట్‌ని బెల్లంకొండ సురేష్ తాను నిర్మిస్తున్న ‘రభస’ షూటింగ్ కోసం అద్దెకి తీసుకున్నారు. దీనికోసం 58 లక్షల రూపాయలు ఇస్తానని మంచు లక్ష్మితో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సదరు సెట్‌లో ‘రభస’ షూటింగ్ పూర్తి చేసిన అనంతరం మంచు లక్ష్మికి ఇవ్వాల్సిన డబ్బు బెల్లంకొండ సురేష్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ‘రభస’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా విడుదలైన తర్వాత డబ్బుల గురించి అడిగినా ఉపయోగం వుండదన్న ఉద్దేశంతో మంచు లక్ష్మి మనుషులు మంగళవారం నాడు బెల్లంకొండ ఇంటిముందు ‘రభస’ చేశారు. దీంతో ఫిలింనగర్‌లోని సురేశ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.