త్వరలో చంద్రబాబు అరెస్ట్! కర్నూల్ పోలీసుల క్లారిటీ...

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కర్నూలులో కేసు నమోదు కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది.న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో చంద్రబాబుపై 188, 505/1/బి/2, 54 సెక్షన్లు, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు కర్నూల్ వన్ టౌన్ పోలీసులు. చంద్రబాబుపై కేసు నమోదు కావడంతో.. త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు పెట్టడం టీడీపీలో కలవరం రేపుతోంది. కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ చంద్రబాబుపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్440కే వైరస్ ఉందంటూ భయపెడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై కర్నూల్ జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప స్పందించారు. ఎన్ 440కే వైరస్‌పై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈకేసులో చంద్రబాబు‌కు నోటీసులు ఇస్తామని తెలిపారు. చంద్రబాబుకు నోటీస్ ఇచ్చి 7 రోజుల్లోపు హాజరు కావాలని కోరుతామన్నారు. శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తగిన నిర్ణయం తీసుకుంటారని కర్నూల్ ఎస్పీ డా.ఫక్కీరప్ప చెప్పారు.