పురుగుల మందు తాగిన సర్పంచ్ .. 

ఓపెన్ చేస్తే.. అది సిద్దిపేట జిల్లా. కోహెడ మండలం. శ్రీరాములపల్లి గ్రామం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. గురువారం పంచాయతీ సమావేశం జరిగింది. నిధుల విషయంలో ఇద్దరు మహిళలకు వాగ్వాదం జరిగింది. చివరికి ఆ గొడవ పెరిగింది. ఆ గొడవతో మనస్తాపానికి గురైన ఓ మహిళ సర్పంచ్ పురుగుల మందు తాగడానికి కారణం అయింది. 

గ్రామ సర్పంచ్ మంజుల అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి వెచ్చించిన నిధుల విషయంలో సర్పంచ్ మంజులకు, గ్రామ కార్యదర్శి సుమలతకు మధ్య గొడవ జరిగినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. ఈ గొడవతో మనస్థాపానికి గురైన సర్పంచ్ మంజుల గ్రామ పంచాయతీకి సమీపంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆమెను హుటాహుటిన కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.