టిడిపి విజయవాడ ఎంపీ సీటు కేసినేని నానికే
posted on Mar 25, 2013 10:03AM
టిడిపి విజయవాడ లోక్ సభ అభ్యర్ధిగా పోటి చేసేందుకు ట్రావెల్స్ అధినేత కేసినేని నానికి చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో చంద్రబాబు ఆదివారం విజయవాడ నాయకులతో భేటి అయ్యారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..విజయవాడ లోక్సభ అభ్యర్ధిగా కేసినేని నాని ని ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు కృష్ణాజిల్లా పాదయాత్ర ప్రారంభానికి ముందే కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ సీటుకు హామీ పొందారు. విజయవాడ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఖర్చంతా ఆయనే భరించారు. చంద్రబాబు యాత్రకు గుర్తుగా పరిటాల వద్ద కేశినేని నాని సుమారు రూ.70 లక్షల వ్యయంతో పైలాన్ నిర్మించారు. విజయవాడ సీటు తనకే ఖరారు అవడంతో.. అర్బన్ అధ్యక్ష పదవి కూడా కావాలని అడిగారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు.
ఈ నేపథ్యంలో అర్బన్ అధ్యక్ష పదవి నుంచి వంశీని తప్పించడానికి రంగం సిద్ధం చేశారు. ఆయన స్థానంలో నాని సూచించిన నాగుల్ మీరాను నియమించనున్నట్టు అధినేత స్వయంగా సంకేతాలు ఇచ్చారు. అదేసమయంలో నాలుగేళ్లుగా నగర పార్టీ బాధ్యతలు మోస్తున్న వంశీకి నెమ్మదిగా నచ్చచెప్పి మార్పులు చేద్దామని చంద్రబాబు నిర్ణయించారు.