కట్జూ వ్యాఖ్యలపై సుప్రీంలో పిటిషన్

 

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంగళవారం ఒక పిటీషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. కట్జూ తన వ్యాఖ్యల్లో పేర్కొన్నట్టుగా న్యాయ వ్యవస్థలో అవినీతిపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు రాజారామన్, సతీష్ గల్లా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాసు హైకోర్టుకు చెందిన అదనపు న్యాయమూర్తి పదవీకాలం పొడిగింపు విషయంలో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజీపడ్డారని కట్జూ చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. కట్జూ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ఉభయ సభల్లో ఇదే అంశంపై జరిగిన స్వల్పస్థాయి చర్చలో కూడా కట్జూ వ్యాఖ్యలను ప్రభుత్వం కూడా సమర్థించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులుగా ఉన్న ఆర్.సి. లహోటి, వైకే సబర్వాల్, కేజీ బాలకృష్ణన్ రాజకీయ ఒత్తిడికి తలొగ్గి అసంబద్ధంగా వ్యవహరించారని విమర్శించారు.