మాజీ మంత్రి కాకాణికి బిగ్ షాక్
posted on Jun 5, 2025 2:41PM

వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈ నెల 3న విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టి వాయిదా వేసింది. ఇవాళ కూడా మరోసారి కేసులో వాదోపవాదాలు విన్న మెజిస్ట్రేట్ విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఇదే కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది.
ఏ4గా ఉన్న కాకాణిని బెంగుళూరులో ఓ రిసార్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏపీపీ కేథార్ నాథ్ను స్పెషల్ పీపీగా బాధ్యతలు ఇచ్చి నెల్లూరుకు పంపింది ప్రభుత్వం. నేడు కేథార్ నాథ్ స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రొసీక్యూషన్ రాజేంద్ర ప్రసాద్కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో నెల్లూరు ఎస్సీ ఎస్టీ 5వ అదనపు ప్రత్యేక న్యాయస్థానానికి రాజేంద్రప్రసాద్ చేరుకుని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.