ప్రమాదంలో అభిమాని.. స్పందించని జనసేనాని
posted on Nov 27, 2018 12:15PM
మితిమీరిన అభిమానం ప్రమాదమని పెద్దలు చెప్తున్నా వినకుండా.. కొందరు హీరో మీదనో, నాయకుడి మీదనో అభిమానం పెంచుకుంటారు. చివరికి ప్రాణం మీదకు తెచ్చుకొని తల్లిదండ్రులకు బాధను మిగుల్చుతారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇటీవల దేవరపల్లిలో పవన్ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేటకి చెందిన మనోహర్ అనే యువకుడు కూడా పాల్గొన్నాడు. అయితే ర్యాలీలో ప్రమాదవశాత్తు మనోహర్ కిందపడగా అతనిపై నుంచి మరో బైక్ దూసుకుపోయింది. తీవ్రగాయాలపాలైన అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా కిడ్నీ తొలగించారు.
ఈ ఘటనపై మనోహర్ తండ్రి మొళ్ల వీరబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా కుమారుడి స్నేహితులు కొవ్వూరు సభలో పవన్ కళ్యాణ్ కు నా కుమారుడి ప్రమాద ఫొటోలు చూపించారు. అయితే ఆయన మనోహర్ ఎలా ఉన్నాడని కూడా అడగలేదు. దీంతో రూ.5 లక్షలు అప్పు చేసి బిడ్డను కాపాడుకున్నా. తాజాగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. మరింత డబ్బు అవసరం అవుతుంది. గత పది రోజులుగా రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలోనే ఉంటున్నాం. నా బిడ్డను కాపాడుకోవడానికి దాతలు ఎవరైనా సహాయం చేస్తే వారికి రుణపడి ఉంటా అని వేడుకున్నారు. మరి ఈ తండ్రి బాధ చూసైనా పవన్ స్పందిస్తారేమో చూడాలి.