ఊపిరి ఉన్నంత వరకూ ఇండియన్‌నే: సానియా

 

తెలంగాణ ప్రభుత్వం టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ కోడలిని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడమేంటన్న విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. ఈ నేపథ్యంలో సానియా స్పందించింది. తాను తన ఊపిరి ఉన్నంతవరకూ భారతీయురాలేనని స్పష్టం చేసింది. తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడం తనకు బాధ కలిగిస్తోందని చెప్పింది. ఈ విషయంలో ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని వాపోయింది. ఎవరైనా తనను భారతీయురాలు కాదంటే తాను ఎంతమాత్రం అంగీకరించనని, తనపై విదేశీయురాలి ముద్ర వేయడాన్ని సహించలేనని సానియా చెప్పింది. తన కుటుంబం శతాబ్ద కాలంగా హైదరాబాద్‌లో నివసిస్తోందని సానియా గుర్తు చేసింది. తనను విమర్శిస్తున్నవారు అనవసర విషయాల మీద సమయాన్ని వృధా చేయకుండా దేశానికి ఉపయోగపడే అంశాల మీద దృష్టి పెడితే బాగుంటుందని సానియా సలహా ఇచ్చింది.