ఐపీఎస్‌ల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఝలక్

 

ఐపీఎస్‌ల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. బదిలీలపై ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.