కుర్చీ వదిలి ఆరిపోయా...
posted on Aug 25, 2014 11:44AM
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ క్రేజీ పనులు చేయడంలో దిట్ట. ఎంచక్కా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి వస్తే చక్కగా పరిపాలించక, పదవిలో ఉన్నప్పుడు బోలెడన్ని ఓవర్ యాక్షన్లు చేశాడు. చివరికి ముఖ్యమంత్రి పదవికి అనవసరంగా రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాడు. దాంతో ఢిల్లీ ప్రజల దృష్టిలో కేజ్రీవాల్ చీప్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు కేజ్రీవాల్ బాధపడిపోతున్నాడు. ముఖ్యమంత్రి కుర్చీ వదలడం వల్ల అడ్డంగా ఆరిపోయానని అంటున్నాడు. ఎవరైనా సరే వచ్చిన పదవిని వదులుకోకూడదనే విషయం తనకు అనుభవపూర్వకంగా తెలియవచ్చిందని, ఢిల్లీలో జరిగిన ఆప్ కార్యకర్తల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ‘‘రాజకీయాలకు కొత్త కావడం వల్ల కొన్ని తప్పులు చేశా. ఢిల్లీ ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా వుండమంటే 49 రోజుల్లోనే పదవిని వదిలిపెట్టేశా. పదవి పోయాక గానీ నాకు జ్ఞానోదయం కలగలేదు. ఈసారి అధికారం వస్తే మాత్రం కుర్చీని వదిలిపెట్టకుండా ఐదేళ్ళు పరిపాలిస్తా’’ అన్నారు.