కలాం భౌతిక కాయం మదురైకి తరలింపు

 

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం డిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తమిళనాడులో పాలం విమానాశ్రయానికి తరలించారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం.వెంకయ్య నాయుడు స్వయంగా ఆయన భౌతికకాయాన్ని తమిళనాడు తీసుకువెళ్ళారు. వారితోబాటు రక్షణశాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు కూడా వెళ్ళినట్లు సమాచారం. అక్కడి నుండి ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానంలో మదురైకి తరలిస్తారు. మదురై నుండి హెలికాఫ్టర్ ద్వారా ఆయన భౌతిక కాయాన్ని రామేశ్వరం తరలించి అక్కడ ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పుతారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఆయన భౌతిక కాయాన్ని ఒక స్థానిక పాఠశాలలో ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులు తమ మతాచారాల ప్రకారం ఆయన అంత్యక్రియల కార్యక్రమాలు చేస్తారు. రేపు ఉదయం సుమారు 10.30గంటలకు ఆయనను ఖననం చేస్తారు.