సంపద స్పష్టి కేంద్రంగా అమరావతి! కాపాడుకుంటామన్న చంద్రబాబు

నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతి ఇవాళ నిస్తేజంగా ఉండడం బాధ కలిగిస్తోందని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విభజన నష్టాన్ని అధిగమించి 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగావకాశాల కార్యస్థానంగా ప్రజా రాజధాని నిర్మాణం ప్రారంభమైందన్నారు చంద్రబాబు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను ఏడాదిన్నరగా ఆపేశారని టీడీపీ అధినేత విచారం వ్యక్తం చేశారు. 

 

అమరావతి శంకుస్థాపన జరిగి 5 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా చంద్రబాబు స్పందించారు. వేలమంది కూలీలు, భారీ యంత్ర సామగ్రి, వాహనాల రాకపోకలతో కోలాహలంగా, నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని వ్యాఖ్యానించారు. పోటీపడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహం అని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని, దేశ విదేశాల ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని ఈ ప్రభుత్వం కాలరాసిందని చంద్రబాబు ఆరోపించారు. 

 

అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో చట్టవిరుద్ధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణ బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం తుగ్లక్ చర్యని చంద్రబాబు విమర్శించారు. భావితరాల ప్రజల అవసరాలకు అనుగుణంగా, భారతదేశానికి గర్వకారణంగా నిలిచేలా అమరావతి రూపకల్పన చేయబడిందన్నారు. 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల నుంచి తెచ్చిన పవ్రిత మట్టిని, పుణ్యజలాలతో అభిషేకించి శక్తిసంపన్నం చేసిన మన రాష్ట్ర రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పౌరుడి కర్తవ్యమని చంద్రబాబు పిలుపిచ్చారు. 

 

ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రాన్ని ముంచేందుకే తీసుకువచ్చారని వడ్డె శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. చట్టబద్ధంగా చేసిన అమరావతిని మార్చే శక్తి ఎవరికీ లేదన్నారు.  ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతికే ఈ గతి పట్టించారని వడ్డే ఆవేదన వ్యక్తం చేశారు. అయినా న్యాయ స్థానాల మీద నమ్మకం ఉందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై గౌరవం ఉందని.. ఆలస్యం అయినా అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో రాజకీయ క్రీడలు ఆడుతున్నారని శోభనాద్రీశ్వరరావు ఎద్దేవా చేశారు. అందరూ అమరావతే రాజధాని అనే ఏకైక నినాదంతో ఉద్యమం చేస్తున్నారని, మహిళల పోరాటం‌ వల్లే నేడు దేశ వ్యాప్తంగా అమరావతిపై చర్చ జరుగుతుందని చెప్పారు.  ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఐక్యంగా పోరాడి సాధించుకుంటామని వడ్డె శోభనాద్రీశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు.