వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్!!

 

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో, ఏ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కానుందో మరో 8 రోజుల్లో తేలనుంది. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ కంటే వైసీపీ మరింత గట్టిగా బలంగా గెలుపు తమదేనని చెబుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సర్వేలు, రాజకీయ విశ్లేషకుల అంచనాలు కూడా వైసీపీదే అధికారమని చెబుతున్నాయి. కొందరు మాత్రం ఈ నెల 19 న రాబోయే ఎగ్జిట్ పోల్స్ తో ఓ అంచనాకు రావొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌‌పై సీఎం చంద్రబాబు, మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మే 19న రాబోయే ఎగ్జిట్ పోల్స్‌ వైసీపీని అనుకూలంగా ఉంటాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వాటిని చూసి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురికావద్దని చంద్రబాబు సూచించారట. ఖచ్చితంగా టీడీపీయే అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఊహించినట్లు జరుగుతుందో లేదో మే 23 న తేలిపోతుంది.