మాగంటి రాంజీ మృతి! టీడీపీ నేతల సంతాపం
posted on Mar 8, 2021 9:59AM
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు. రాంజీకి 36 ఏండ్లు. ఈ నెల మూడో తేదీన అస్వస్థతకు గురైన ఆయన ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా అదేరోజు పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతిచెందారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా మూడేళ్లుగా పనిచేశారు. చిన్న వయస్సులోనే జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు రాంజీ. మాగంటి బాబు రాజకీయ వారసుడిగా చురుగ్గా వ్యవహరిస్తున్న రాంజీ మృతి అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
మాగంటి రాంజీ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నప్పుడు... ఆయన కోలుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్తోపాటు జిల్లాలోని నాయకులు ఆకాంక్షించారు. మాగంటి బాబు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. రాంజీ మృతి చెందడం బాధాకరమని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాంజీకి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు.