వైసీపీకి బిగ్ షాక్.. ఇద్దరు ఐపీఎస్ లపై ఈసీ బదిలీ వేటు
posted on Apr 24, 2024 6:51AM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ సర్కార్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరూ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని, ఎన్నికలకు సంబంధంలేని విధులను వీరికి అప్పగించాలని ఆదేశించింది. వీరి స్థానంలో ఒక్కో పోస్టుకు ముగ్గురేసి పేర్లతో కూడిన ప్యానెల్ను బుధవారం (ఏప్రిల్ 24) మధ్యాహ్నం 3గంటల లోపు పంపించాలని, అధికారుల వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాలని ఈసీ స్పష్టం చేసింది. గతంలోనూ ఆరుగురు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ పలువురు ఐపీఎస్, ఐఏఎస్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఐఏఎస్లు, ఆరుగురు ఐపీఎస్లపై ఈసీ గతంలోనే బదిలీ వేటు వేసింది. తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటువేసి వైసీపీకి షాకిచ్చింది.
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థతో పాటు పలువురు అధికారులను వైసీపీ కార్యకర్తలుగా మార్చేసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని మరిచి కేవలం కక్షపూరిత రాజకీయాలకే పరిమితమైన జగన్.. పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ వ్యతిరేకులపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు పలువురిని పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలకు గురిచేశారు. గ్రామాలు, పట్టణాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై గొంతెత్తిన వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలపై ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వం అరాచకాలను భరించిన ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ఊపిరిపీల్చుకున్నారు. అయినా పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. కోడ్ ను లెక్క చేయకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో, బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై ఈసీకి ఫిర్యాదులు చేయడంతో.. ఈసీ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో నిజానిజాలను నిగ్గుతేల్చుకొని ఐపీఎస్, ఐఏఎస్లపై బదిలీ వేటు వేసింది. కొద్దిరోజుల క్రితం తొమ్మిదిపై బదిలీ వేటు పడగా.. తాజాగా ఇంటెలీజెన్స్ డీజీ, విజయవాడ సీపీలపై ఈసీ బదిలీ వేటు వేసింది.
ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాలపై విపక్ష నేతలు ఈసీకి అనేక సార్లు ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. బస్సు యాత్ర విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంకు చేరుకోగానే రాయిదాడి ఘటన జరిగింది. ఈ దాడిలో సీఎం జగన్ కంటి పైభాగంలో గాయమైంది. రాయిదాడి ఘటనకు పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యం కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సీపీ కాంతిరాణా నుంచి నివేదికను అందుకుంది. జగన్పై రాయిదాడి ఘటనలో పోలీసుల వైఫల్యంతో పాటు ఇంటెలిజెన్సీ విభాగం వైఫల్యం కూడా కారణమని ఈసీ నిర్దారణకు వచ్చింది. దీనికితోడు ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీ కాంతిరాణాలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. చిలకలూరి పేట ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యాలతో పాటు, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకోకుండా ఇంటెలిజెన్స్ డీజీ ఇబ్బంది పెట్టారని, చాలా మంది విపక్ష నేతల అక్రమ అరెస్టులకు కూడా ఆయనే బాధ్యులుగా ఉన్నారని ప్రతిపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. సీఎం జగన్పై రాయిదాడి ఘటనను సీరియస్గా తీసుకున్న ఈసీ.. ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకొని విచారణ చేసింది. ఈ విచారణలో ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీపై ప్రతిపక్షాల ఆరోపణలు నిజమని తేలడంతో వారిద్దరిపై ఈసీ బదిలీ వేటువేసింది.
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలదే తరువాతి వంతు అన్న చర్చ రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా జరుగుతోంది. వారిద్దరినీ ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని అంటున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి తొలినుంచీ జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారనీ, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదనీ చెబుతున్నారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని.. ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి, ఆ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికితోడు ప్రతిపక్ష పార్టీల నేతలు సీఎస్ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. పోలీస్ బాస్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపైనా బదిలీ వేటుకు ఈసీ రంగం సిద్ధమైనట్లు సమాచారం. రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాతకూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. అక్కడ నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎస్, డీజీపీపై వేటు పడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి ఎన్నికల కోడ్ సమయంలోనూ జగన్ మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై ఈసీ కొరడాఝుళిపిస్తోంది. రానున్న రోజులలో మరింత మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.