మండలిలో టీడీపీకి ఊహించని షాక్.. ఇదేం ట్విస్ట్!!

టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. మండలిలో అధిక సంఖ్యా బలం ఉన్న టీడీపీ, మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సభ్యులంతా హాజరు కావాలని విప్ జారీ చేసింది. ఇలాంటి సమయంలో డొక్కా టీడీపీకి షాకిచ్చారు. తొలిరోజు మండలి సమావేశానికి హాజరైన డొక్కా రెండో రోజు గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్నానని, అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా సమావేశాలకు హాజరుకాలేదు. అయితే.. తాను అనారోగ్యం కారణంగానే హాజరుకాలేదని ఆమె తెలిపారు. కాగా, గత కొంతకాలంగా రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉన్న డొక్కా, ఇటీవలి కాలంలో టీడీపీ కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదు. అయితే ఆయన టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు.. డొక్కా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం మొదలైంది.