టిక్కెట్ తీసుకోలేదని చంపేశారు

 

టిక్కెట్టు లేకుండా ప్రయాణించడం నేరం. అయితే టిక్కెట్టు తీసుకోలేదని చావబాది చంపేయడం మాత్రం పాపం. ఈ ఘోరమైన సంఘటన కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో జరిగింది. డోన్ మీదుగా వెళ్తున్న రైల్లో టీటీఇలు పోలీసులతో కలసి టిక్కెట్ల చెకింగ్ చేశారు. ఈ సందర్భంగా వీళ్ళందరూ కలసి 13 మంది టిక్కెట్ లేని ప్రయాణికులను పట్టుకున్నారు. చట్టప్రకారం వారికి జరిమానా విధించడం చేయాలి. అయితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ పదమూడు మంది ప్రయాణికులను విచక్షణా రహితంగా చావబాదారు. పోలీసుల లాఠీ ధాటికి వీరందరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు (29) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ ఘటన విషయం తెలిసి మృతుడి భార్య కన్నీరు మున్నీరయింది. డోన్ రైల్వేస్టేషన్‌లోని బుకింగ్ హాల్ దగ్గర ఆందోళనకు దిగింది.