భారత్ లో కరోనా కల్లోలం.. కారణాలు ఇవేనట! 

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాది కరోనా తీవ్రతను దాటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా లక్షా 50 వేలకు పైగా కేసులు నమోదుకాగా 794 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 1,32,05,926 మందికి కరోనా సోకగా.. 1,68,436 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలో  కొత్తగా 55, 411 కరోనా కేసులు నమోదుకాగా 309 మంది మరణించారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఒక్కరోజే 9,327 మంది కరోనా బారినపడగా.. 50 మంతి మృతి చెందారు. గుజరాత్‌లో కొత్తగా గుజరాత్‌లో 5,011 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 49 మంది మృతిచెందారు. తమిళనాడులో కొత్తగా 5,989 మంది కరోనా బారిన పడగా.. 23 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో కొత్తగా 6,955 కేసులు నమోదుకాగా 36 మృతిచెందారు. ఛత్తీస్‌గడ్‌లోనూ కరోనా కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ కొత్తగా 14,098 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 97 మంది మరణించారు.

భారత్‌లో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరగడానికి అనేక కారణాలను ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రస్తావిస్తున్నారు. కరోనాలో కొత్త రకాలు, ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉన్న జనాభా ఎక్కువగా ఉండటం, ఎన్నికలు, ఇతర బహిరంగ కార్యక్రమాలు, అజాగ్రత్త, టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడం ఇందుకు కారణమవుతున్నాయని చెప్పారు. టీకా పొందినప్పటికీ జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ప్రజలకు సరిగా తెలియజేయకపోవడం కూడా ఈ విజృంభణకు కారణమే. భారత్‌లోని ప్రముఖ వైరాలజిస్టులు షాహిద్‌ జమీల్, టి.జాకొబ్‌ జాన్‌లు దీనిపై ఆసక్తికరమైన విశ్లేషణలు చేశారు. రాబోయే కొద్ది నెలల్లో వైరస్‌ కొత్త ఉత్పరివర్తనలపై టీకాలు ఎలా పనిచేస్తాయన్నదానిపైనే భవిష్యత్‌లో కొవిడ్‌ తీరుతెన్నులు ఉంటాయని చెప్పారు.  మొదటి ఉద్ధృతి తర్వాత కూడా.. కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నవారు భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారని జమీల్‌ తెలిపారు. మొదటి ఉద్ధృతి తర్వాత అనేక మందిలో అలసత్వం పెరిగిందని చెప్పారు. తాజా విజృంభణకు ఇదే ప్రధాన కారణమన్నారు డాక్టర్ జమీల్. 

టీకా పొందాక కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అధికారులు సరిగా ప్రచారం చేయలేదన్నారు డాక్టర్లు. దేశంలో కొవిడ్‌ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని జమీల్‌ చెప్పారు. జనవరి మధ్యలో టీకాలు మొదలుపెట్టిన సమయంలో రోజువారీ ఇన్‌ఫెక్షన్లు తక్కువగా ఉన్నాయన్నారు. ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా అర్హులైన కొందరు టీకాలపై విముఖత చూపారు. మార్చి మొదటినుంచే కేసుల సంఖ్య పెరగడం మొదలుపెట్టినప్పటికీ 60ఏళ్లు పైబడినవారిలోనూ పలువురు వ్యాక్సిన్లపై ఆసక్తి చూపలేదు. ఇప్పుడు వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. మరోపక్క దేశంలో 0.7 శాతం మంది మాత్రమే టీకాకు సంబంధించిన రెండు డోసులను తీసుకున్నారు. 5 శాతం మందికి ఒక డోసు అందింది. అందువల్లే వ్యాక్సినేషన్‌ ఫలితాలు పెద్దగా కనిపించడంలేదని వివరించారు.  

కరోనా కొత్త రకాలు కూడా తాజా ఉద్ధృతికి దోహదపడి ఉంటాయని జమీల్, జాన్‌లు చెప్పారు. ‘‘ప్రజల్లో అలసత్వం పెరిగిన సమయంలోనే వైరస్‌లో కొత్త రకాలు వచ్చి పడ్డాయి. ఫలితంగా మొదటి ఉద్ధృతితో పోలిస్తే రెండో విజృంభణలో వైరస్‌ వ్యాప్తి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంది. ఈ అంశంలో మనకు దిశానిర్దేశం కొరవడింది’’ అని జాన్‌ పేర్కొన్నారు. పంజాబ్‌లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో బ్రిటన్‌ రకం వైరస్‌ల వాటా 80 శాతం ఉందన్నారు. దీనికితోడు రెండు ఉత్పరివర్తనలు కలిగిన ఒక కొత్త రకం వైరస్‌.. భారత్‌లో ఆవిర్భవించిందని చెప్పారు. మహారాష్ట్రలో జన్యుక్రమాలను పరిశీలించిన కొత్త కేసుల్లో 15-20 శాతం వాటాను ఇదే ఆక్రమించిందని తెలిపారు. ఈ రెండు కాక.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలు కూడా ఉన్నాయన్నారు. బ్రిటన్‌ రకం.. 50 శాతం ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు.   

ఇలా చేస్తే బెటర్

ఉద్ధృతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే టీకాలను ఇస్తూ.. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 18ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఇవ్వాలని జమీల్‌ కోరారు. వ్యాక్సిన్ల సరఫరాకు అనుగుణంగా ఆ కార్యక్రమాన్ని సమతౌల్యం చేసుకోవాలన్నారు. నెలకు కోటి డోసుల మేర కొవిషీల్డ్, 30 లక్షల డోసుల మేర కొవాగ్జిన్‌ టీకాలను పంపిణీ చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని చెప్పారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్, స్పుత్నిక్‌ వి టీకాలకూ అత్యవసర వినియోగ అనుమతినిస్తే వ్యాక్సిన్ల లభ్యత పెరుగుతుందన్నారు.