కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా

 

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల విడుదల చేసింది. ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తదితరులు పాల్గొన్నారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సంపద, సంక్షేమమే లక్ష్యంగా దేశంలోని  అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. దేశంలో 2030 నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశామని తెలిపారు. దీన్ని గదిలో కూర్చుని రూపొందించలేదని, ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని చెప్పారు. హస్తం గుర్తును ప్రతిబింబించేలా మేనిఫెస్టోలో ఐదు ముఖ్యాంశాలు ఉన్నాయని వివరించారు.

1. న్యాయ్‌ పథకం ద్వారా ఏడాదికి రూ.72వేలు చొప్పున పేదలకు అందిస్తాం. ఈ పథకం రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటగా ఇది పేదల జేబుల్లో డబ్బులు నింపుతుంది. రెండోది నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థికపరిస్థితిని మెరుగుపరుస్తుంది.

2. ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తాం. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి తొలి మూడేళ్ల పాటు ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీని పటిష్ఠం చేస్తాం. ఇప్పుడున్న పని దినాలను 100 నుంచి 150కి పెంచుతాం.

3. రైతుల కోసం 'కిసాన్‌ బడ్జెట్‌' పేరిట ప్రత్యేక బడ్జెట్‌ను తీసుకొస్తాం. రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్‌ కేసులుగా పరిగణించం.

4. విద్యపై జీడీపీలో 6 శాతం ఖర్చు చేస్తాం.

5. జాతీయ, అంతర్గత భద్రతకు ప్రాధాన్యం

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకా అనేక హామీలు పొందుపరిచారు. అధికారంలోకి రాగానే రాఫెల్ డీల్ పై విచారణ. వివిధ బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై సమగ్ర విచారణ వంటి హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశం కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండడం విశేషం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ మీద తొలి సంతకం చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పలు సార్లు ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని మేనిఫెస్టోలో వివరించింది.