కూటమిలో ట్విస్ట్.. కాంగ్రెస్ టీడీపీకి షాక్ ఇవ్వనుందా?

 

మహాకూటమిలోని పార్టీలు కాంగ్రెస్, టీడీపీ ఇప్పటికే రెండు విడుతలుగా అభ్యర్థులను ప్రకటించాయి. నేడు మూడు విడుత కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. అయితే ఇప్పటివరకు ప్రకటించిన కొన్ని స్థానాల్లో ఇరు పార్టీలకు అసంతృప్తి సెగ తగులుతుంది. ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ సీటు కాంగ్రెస్‌ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆశించారు. అంతేకాదు ఆయనికి పశ్చిమ టిక్కెట్ కేటాయించాలని హన్మకొండ డీసీసీ భవన్‌లో స్థానిక నేతలు ఆమరణ దీక్ష కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటుని టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయించారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రాజేందర్‌రెడ్డి తనకు పశ్చిమ టిక్కెట్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టారు. ఇప్పుడు ఏకంగా పశ్చిమ నుంచి కాంగ్రెస్ తరుపున నామినేషన్ వేసి టీడీపీకి పెద్ద షాకే ఇచ్చారు.

హన్మకొండలోని ఆర్‌డీవో కార్యాలయంలో బుధవారం రాజేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగానే నామినేషన్‌ వేసినట్లు స్పష్టం చేశారు. వరంగల్‌ పశ్చిమ టిక్కెట్ న్యాయంగా తనకే దక్కాల్సి ఉందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌అలీ వంటి ముఖ్య నేతలు పశ్చిమ నియోజకవర్గ పార్టీ సభలు, సమావేశాలలోనే ప్రకటించారని రాజేందర్‌రెడ్డి చెప్పారు.

పశ్చిమ కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుండడంతో టిక్కెట్ విషయంపై అధిష్ఠానం పునరాలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధినేతలు తనతో ఫోన్‌లో కూడా సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. తనకు న్యాయం జరుగుతుందన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి పెద్ద మనస్సుతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా, వివిధ పార్టీ పదవులతో రాజకీయ అనుభవం గడించిన ప్రకాష్ రెడ్డి పశ్చిమ టిక్కెట్ తనకు ఇవ్వాలని రాజేందర్‌రెడ్డి కోరారు.

టిక్కెట్ ప్రకటించిన తరువాత కూడా వరంగల్ పశ్చిమ సీటుపై సస్పెన్స్ వీడటంలేదు. కూటమి పొత్తులో భాగంగా ఈ సీటుని టీడీపీకి కేటాయించారు. టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించింది. ఇంతలోనే రాజేందర్‌రెడ్డి ట్విస్ట్ ఇస్తూ కాంగ్రెస్ తరుపున నామినేషన్ వేశారు. మరి కాంగ్రెస్ ఈ టిక్కెట్ విషయంలో రాజేందర్‌రెడ్డిని బుజ్జగిస్తుందో లేక టీడీపీకి షాక్ ఇస్తుందో చూడాలి.