ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు
posted on Jun 12, 2025 2:35PM
.webp)
ఈ నెల 20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత సౌకర్యం అమలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో సూపర్-6 పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నామని సీఎం తెలిపారు. తల్లికి వందనం పథకం 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నాం. దీనికోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది. గతంలో ‘అమ్మఒడి’కి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమికి రెండు కళ్లు అని చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే మేం 67 లక్షల మందికి అందిస్తున్నామని ఆయన తెలిపారు.