పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయాలు

 

 

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించడానికి వీలుగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

 

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న దరిమిలా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన పోలవరం ప్రాజెక్టు ఖర్చు కేంద్రమే భరిస్తుంది.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 20వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. అందులో రూ. 18వేల కోట్లు కేంద్రం సమకూర్చనుంది.



ప్రాజెక్టు అనుమతులు సంపాదించే బాధ్యతను కూడా కేంద్రమే తీసుకుంటుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, వారికి నష్టపరిహారం చెల్లించడం కూడా కేంద్రమే చూసుకుంటుంది. ఎస్పీవీ ఏర్పాటు చేయడం ద్వారా వేగంగా అనుమతులు సంపాదించడానికి, నష్టపరిహారం చెల్లించడానికి, పునరావాసం కల్పించడానికి వీలవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.