బండి సంజయ్ పై కేసు నమోదు 

ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది. 
 కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌తో పాటు ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. చెంగిచెర్లలో  ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచెర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు.బండి సంజయ్ అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడకు రావడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎవరినీ లోనికి అనుమతించకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకున్న బండి సంజయ్, కార్యకర్తలు బారీకేడ్లను తోసుకొని లోనికి వెళ్లారు. ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించారు. వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు, కబేళా నిర్వాహకులు కక్షతో పేద గిరిజన మహిళలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బస్తీకి వచ్చి మరీ మహిళలు, పిల్లలపై దాడులు చేశారని, ఇందుకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో తన విధులకు ఆటంకం కలిగించారని, తనపై దాడి చేశారని నాచారం సీఐ ఫిర్యాదు చేశారు.