చీలిక ముంగిట బీఆర్ఎస్? మూడు కుర్చీలాట సంకేతమదేనా?
posted on May 14, 2025 11:01AM

భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చీలిక ముంగిట నిలిచిందా? ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తన వారసుడి ప్రకటనకు ముహూర్తం పెట్టేసి రాజకీయ విరమణ లేదా రాజకీయ సన్యాసానికి రంగం సిద్ధం చేసేసుకున్నారా? అంటే బీఆర్ఎస్ లో గత కొన్ని రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది. గత కొంత కాలంగా ఒక పద్ధతి ప్రకారం పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతూ లేదా తగ్గిస్తూ వస్తున్న తీరు, అలాగే ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీ లైన్ కు భిన్నంగా చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే.. పార్టీ పగ్గాల విషయంలో బీఆర్ఎస్ లో మూడు కుర్చీలాట జోరుగా సాగుతున్నదని పరిశీలకులు అంటున్నారు.
2023 ఎన్నికలలో బిఆర్ఎస్ పరాజయం తరువాత నుంచీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ పొలిటికల్ గా ఏమంత యాక్టివ్ గా లేరు. ఇంత కాలం ఆయన రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం మాత్రమే తీసుకున్నారని అంతా భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే పార్టీ వర్గాలలో కూడా ఆయన తీసుకున్నది తాత్కాలిక విరామం కాదనీ, రాజకీయ విరమణేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు పూర్తిగా పగ్గాలు అప్పగించేయడమే తరువాయి అన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా కేసీఆర్ నెమ్మదిగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల వరంగల్ వేదికగా జరిగిన పార్టీ పాతికేళ్ల సభలో హరీష్ రావు ప్రస్తావన, ప్రాముఖ్యత ఇసుమంతైనా లేకుండా అంతా కేటీఆరే అన్నట్లుగా నిర్వహించారంటున్నారు. అదే సమయంలో విషయాన్ని గుర్తించిన హరీష్ రావు తన దారి తాను చూసుకునేందుకు నిర్ణయించుకున్నారన్న వార్తలూ జోరుగా వినిపించాయి. అదే సమయంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా తన సంగతేంటంటూ గొంతెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
తాజాగా ఆమె రామానుజపురంలో నాంచారమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోది చెప్పే నాంచారమ్మలు కవిత భవిష్యత్ లో తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. వారి మాటలను చిరునగవుతో విన్న కవిత జై తెలంగాణ అంటూ నినదించారు. ఈ సంఘటన యథాలాపంగా జరిగింది కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆమె సామాజిక తెలంగాణ సాధన ఇంకా మిగిలే ఉందంటూ చేసిన వ్యాఖ్యకు దీనిని జోడించి సొంత సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారంటున్నారు. అది పక్కన పెడితే.. సందర్భంతో సంబంధం లేకుండా తాను కేసీఆర్ ఎవరికి పగ్గాలు అప్పగించినా స్వాగతిస్తానంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయనలోని అసంతృప్తికి, అసహనానికీ తార్కానంగా చెబుతున్నారు. అదే సమయంలో హరీష్ పార్టీ తదుపరి అధ్యక్షుడి విషయం లేవనెత్తడాన్ని కేసీఆర్ పోలిటికల్ రిటైర్మెంట్ కు రెడీ అయిపోయారన్న సంకేతాన్ని ఇవ్వడమేనని చెబుతున్నారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా కేటీఆర్ అంగీకరించని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు.. ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్ష పగ్గాలనే అప్పగిస్తానని కేసీఆర్ అంటే అంగీక రిస్తారా అన్న అనుమానాలూ సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అధినేతగా కేసీఆర్ ఉన్నంత వరకూ ఆయన అభిప్రాయాన్ని కాదని ఎవరూ అనరు కానీ, ఒక సారి ఆయన ఆ స్థానం నుంచి తప్పుకుంటే మాత్రం కేసీఆర్ మాట ఇక పార్టీలో ఎంత మాత్రం శిలాశాసనం అన్న పరిస్థితి ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశీలకులు బీఆర్ఎస్ చీలిక అంచున ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
.webp)