వరద కష్టాలు.. ఒడ్డునే ప్రసవం
posted on Jul 19, 2022 12:32PM
అకాల వర్షాలతో వాగులు, వంకలూ పొంగి పొర్లుతూన్నవేళ, గ్రామాలు, కుగ్రామాల్లో ప్రజలు ప్రాణభీతితో వణుకుతున్నవేళ ఓ శిశువు జననం ఓ గ్రామాన్ని భయాందోళనల నుంచి ఆనందోత్సాహంలోకి తెచ్చింది. కన్నీళ్ల నుంచీ ఆనందభాష్పాలు పంచుకునేలా చేసింది. కష్టాల మనసుకు రవ్వంత ఊరటనిచ్చింది. గాంధారి వాగు దాటుతోన్నసమయంలో ఓ గర్భిణి ప్రసవించింది.
అసలే ఎడతెరిపిలేని వర్షాలతో వాగులూ అడవి బిడ్డలను ఖంగారెత్తిస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం.. ఆస్పత్రేలేవీ దగ్గరా దాపు ఉండవు. వాగులు దాటి వెళ్లాల్సిందే. ఈమధ్య భారీవర్షాలు అటుగా దాటి వెళ్లడానికీ చాలా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితుల్లో ఉన్నా రంతా. సరిగ్గా ఈ పరిస్థితులు, ఈ ఆందోళన సమయంలోనే ఓ గర్భిణికి నొప్పులు వచ్చి ఆస్పత్రికి తీసికెళ్లాల్సి వచ్చింది. ఆమె ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ మామిడి గూడు గ్రామానికి చెందిన ఉయిక. ఆమెను గాంధారి వాగు దాటించి ఆస్పత్రికి తీసికెళ్లాలి. గ్రామస్థులు ఆమెను ఇంద్ర వెల్లి పీహెచ్సీకి తరలించేందుకు సిద్ధమయ్యారు.
వారిలో ఆమెను, బిడ్డను కాపాడగలమన్న ధైర్యం, వారిలో ఆ తల్లి ఆనందాన్ని చూడగలమన్న నమ్మకం.. వెరసి వాగును దాటడం పెద్ద కష్టమేమీ కాదన్న పదింతల ధైర్యాన్నిచ్చింది. అంతే రెండ డుగులు వేసారో లేదో ఆమెకు భరించలేని నొప్పులు ఆరంభమయ్యాయి. అంతే ఆమె మరుక్షణం గట్టు మీదనే ప్రసవించింది. సమాచారం అందుకున్న పిట్టబొంగరం పీహెచ్సీ హెచ్ఈవో అశోక్, వాల్గొండ ఏఎన్ఎం జానా బాయి, ఆశా కార్యకర్త మైనాబాయి వాగు దాటి వెళ్లారు.
గ్రామస్థుల సహాయంతో తల్లీ, బిడ్డలను క్షేమంగా వాగు దాటించారు. అంతేకాదు బాలింత ఆస్పత్రికి చేరేందుకు ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు నడిచింది. అక్కడినుంచి అంబులెన్స్లో ఇంద్రవెల్లి పీహెచ్ సీ కి తరలించారు. తల్లీ బిడ్డా క్షేమమని తెలిసి మామిడిగూడు గ్రామస్తుల్లో ఆనందం ఆకాశాన్నంటింది.