కంపెనీ తీసుకురావడమంటే పంచాయతీ భవనాలకు రంగులేసుకున్నంత ఈజీ కాదు

ఆంధ్రప్రదేశ్ లో అపోలో టైర్స్ తన తొలి టైర్ ని విడుదల చేసింది. టీడీపీ హయాంలో 2018 లో అపోలో టైర్స్ ను ఏర్పాటు చేయగా.. ఈరోజు కంపెనీ నుండి తొలి టైర్ విడుదలైంది. దీనిపై టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.

"ఏపీ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలన్న తపనతో, రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తెచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తోంది. చిత్తూరు జిల్లా, చిన్నపండూరులో 2018లో ఏర్పాటు చేసిన అపోలో టైర్స్ ఈరోజు నుండి ఉత్పత్తి ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది." అని చంద్రబాబు అన్నారు.

"రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురావడం అంటే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నంత ఈజీ కాదు. రికార్డ్ టైం లో కంపెనీలు ఏర్పాటు కావాలన్నా, నిరుద్యోగ యువత కి ఉద్యోగాలు కల్పించాలన్నా, అది ఒక చంద్రబాబు గారికే సాధ్యం." అని లోకేష్ వ్యాఖ్యానించారు.

"టిడిపి హయాంలో కంపెనీ ఏర్పాటుకి ముందుకు వచ్చి, తొలిదశలో రూ.3,800కోట్ల పెట్టుబడి పెట్టి, ఈరోజు తొలి టైర్ ని విడుదల చేసిన అపోలో టైర్స్ వారిని అభినందిస్తున్నాను. కంపెనీ మరింత వృద్ధిచెంది ఆంధ్రరాష్ట్ర యువతకి మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను." లోకేష్ పేర్కొన్నారు.