ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ లో మార్పు!!
posted on Jan 25, 2021 3:21PM
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయింది. దీంతో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ స్వల్పంగా మారింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో దశగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 21న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు దశల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు దశలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి 9న, రెండో దశ ఫిబ్రవరి 13న, మూడో దశ ఫిబ్రవరి 17, నాలుగో దశ ఫిబ్రవరి 21న జరగనున్నాయి.